వేసవిలో కూలింగ్ వాటర్ తాగుతున్నారా?
వేసవి కాలం రాగానే భానుడి భగభగలకు ఉపశమనం కోసం అందరూ ఫ్రిజ్ నీళ్ల వైపు పరుగెడుతుంటారు. అయితే, ఆ క్షణానికి అది హాయినిచ్చినప్పటికీ...
By - అంజి |
వేసవిలో కూలింగ్ వాటర్ తాగుతున్నారా?
వేసవి కాలం రాగానే భానుడి భగభగలకు ఉపశమనం కోసం అందరూ ఫ్రిజ్ నీళ్ల వైపు పరుగెడుతుంటారు. అయితే, ఆ క్షణానికి అది హాయినిచ్చినప్పటికీ, ఆరోగ్య పరంగా కొన్ని చిక్కులు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత సుమారు 37°C ఉంటుంది. మనం ఐస్ కోల్డ్ వాటర్ తాగినప్పుడు, శరీరం ఆ నీటిని తిరిగి శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి అదనపు శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి, అలసట వచ్చే అవకాశం ఉంది. చల్లని నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది ఆహారం అరగడానికి అడ్డుపడుతుంది.
ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే కూలింగ్ వాటర్ తాగితే, ఆహారంలోని కొవ్వు పదార్థాలు గడ్డకట్టి, జీర్ణక్రియ మరింత క్లిష్టంగా మారుతుంది. అతి చల్లని నీరు తాగడం వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం పేరుకుపోతుంది. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని అత్యంత పొడవైన నరము 'వేగస్ నెర్వ్'. అతి చల్లని నీరు ఈ నరమును స్టిమ్యులేట్ చేయడం వల్ల గుండె వేగం తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల చల్లటి నీరు తాగకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో దప్పిక తీర్చుకోవడానికి కుండలో నీరు ఉత్తమమైన మార్గం. ఇది నీటిని సహజసిద్ధంగా చల్లబరుస్తుంది. నీటిలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. కుండ నీరు గొంతుకు, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఎండలో బయట నుండి వచ్చిన వెంటనే ఐస్ నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాధారణ నీరు లేదా మట్టి కుండలో నీరు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.