బంగారాన్ని తయారు చేసే సూక్ష్మజీవి ఉందంటే మీరు నమ్ముతారా? ఇది కట్టు కథ అనుకుంటున్నారేమో! కానీ, కాదు. శాస్త్రవేత్తలే దీన్ని కనిపెట్టి, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విషపూరిత లోహ వ్యర్థాలను అత్యంత విలువైన బంగారంగా మార్చగల అద్భుతమైన బ్యాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ, టిక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేసిన ఓ పరిశోధనలో 'కుప్రియావిడస్ మెటల్లిడ్యురాన్స్' అనే సూక్ష్మజీవి మలినాలతో బంగారాన్ని తయారు చేస్తోందని తేలింది.
ఈ బ్యాక్టీరియా copA అనే ఓ ప్రత్యేకమైన ఎంజైమ్ను ఉపయోగించుకుని తన శరీరంలోకి చేరిన విషపూరిత బంగారు సమ్మేళనాలను విషరహిత బంగారు కణాలుగా మారుస్తోందట. అయితే, ఈ సూక్ష్మ బంగారు కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి చిన్న చిన్న బంగారు ముక్కలుగా మారుతున్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. ఈ ప్రక్రియ ఆధారంగా.. బంగారం సహజంగా ఎలా ఏర్పడుతుందని అనే ప్రశ్నకు సమాధానం దొరకవచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే బంగారం తయారీకి ఈ బ్యాక్టీరియాను వాడాలనే యోచన కూడా చేస్తున్నారు.