ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్
AP EAPCET results released. ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల
By అంజి Published on 26 July 2022 6:50 AM GMT
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. విడుదలైన ఫలితాల్లో.. అగ్రికల్చర్ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్సీహెచ్ఈ తరఫున జేఎన్టీయూ అనంతపురం ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 87,744మంది పరీక్షకు హాజరయ్యారు. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. విజయవాడలో జరిగిన ఫలితాల విడుదల కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు.
ఫలితాలు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
త్వరలోనే ఆయా విభాగాలకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.
కౌన్సెలింగ్ సమయంలో ఏపీ ఎప్సెట్- 2022 ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్(టీసీ), పదో తరగతి మార్కుల మెమో, నివాస ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటి పత్రాలు అవసరం ఉంటుంది.