రైలు ప్రయాణంలో రూ.10 లక్షల బీమా.. ప్రయాణికులు ఇది తెలుసుకోండి

ప్రయాణిలకు భద్రత, సౌకర్యం కోసం రైల్వే విభాగం అనేక చర్యలు చేపడుతోంది. అందులో బీమా సదుపాయం ఒకటి.

By అంజి  Published on  17 July 2024 7:48 AM GMT
insurance, train travel, Passengers,Indian Railways

రైలు ప్రయాణంలో రూ.10 లక్షల బీమా.. ప్రయాణికులు ఇది తెలుసుకోండి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. తక్కువ ధరలో ఎక్కువ మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణిలకు భద్రత, సౌకర్యం కోసం రైల్వే విభాగం అనేక చర్యలు చేపడుతోంది. అందులో బీమా సదుపాయం ఒకటి. ఈ మధ్య రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో చాలా మంది ఈ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారు. మీకు వ్యక్తిగతంగా ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ లేకపోయినా.. కేవలం 45 పైసలకే ఈ పాలసీ తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

మనం ఆన్‌లైన్‌లో ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్‌ అని ఆప్షన్‌ కనిపిస్తుంది. అది డీఫాల్ట్‌గా ఎంపిక చేసే ఉంటుంది కాబట్టి మనం దానిపై టిక్‌ చేయాల్సిన పని లేదు. కొందరు ఈ 45 పైసలు వృథా చేయకూడదని క్యాన్సిల్‌ చేస్తుంటారు. ఇలా చేస్తే దురదృష్టవశాత్తు ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైనప్పుడు ఈ వ్యక్తికి ఎలాంటి ఆర్థిక సాయం అందదు.

ఈ ఇన్సూరెన్స్‌ కింద ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడి అంగవైకల్యం వస్తే రూ.7.5 లక్షల బీమా అందుతుంది. స్వల్ప గాయాలతో ఆస్పత్రి పాలైనవారికి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు ఇస్తారు. ప్రమాదవశాత్తు ప్రయాణికుడు మరణిస్తే మృతదేహాన్ని తరలించడానికి రూ.10 వేలు ఇస్తారు.

ఐదు ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఈ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్‌ ఎంచుకున్న వారికి టికెట్‌ కన్ఫర్మ్‌ అయ్యాక మొబైల్‌ నంబర్‌, ఈ - మెయిల్‌కు సందేశం వస్తుంది. తర్వాత నామినీ వివరాల కోసం లింక్‌ పంపిస్తారు. ఈ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్‌ చేసుకోవడానికి సంబంధిత పత్రాల్ని దగ్గర్లోని బీమా సంస్థకు సమర్పిస్తే 4 నెలల్లో ప్రయోజనాలు పొందుతారు. రైల్వేస్టేషన్‌ కౌంటర్‌లో టికెట్‌ తీసుకుంటే ఈ బీమా వర్తించదు.

Next Story