భారత్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24గంటల్లో 77,266 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 5:04 AM GMT
భారత్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు.. 24గంటల్లో 77,266 కేసులు

దేశంలో కరోనా వైరస్‌ ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా నిత్యం 60వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 77,266 కేసులు నమోదు కాగా.. 1,075 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,87,501కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 25,83,948 మంది కరోనా పేషంట్లు కోలుకున్నారు.

ప్రస్తుతం భారత్‌లో 7,42,023 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మహమ్మారి బారీన పడి ఇప్పటి వరకు 61,529 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రికవరీ రేటు 76.28శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.8శాతంగా ఉంది. కాగా.. నిన్న ఒక్క రోజే 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. దీంతో మొత్తం కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు 3,94,77,848 చేరిందని వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 60,46,634 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 37,64,493 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌లో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరికొద్ది రోజుల్లోనే భారత్‌ రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story