భారత్లో 31లక్షలు దాటిన పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2020 5:19 AM GMTభారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,408 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 836 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 31,06,348కి చేరింది. మొత్తంగా 57,542 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఒక్క రోజే 57,468 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. మొత్తంగా ఆ సంఖ్య 23,38,036కి చేరింది. ప్రస్తుతం 7,10,771 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలొ రికవరీ రేటు 75.27శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.86శాతంగా ఉంది. నిన్నటి వరకు మొత్తం 3,59,02,137 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. 58,74,146 పాజిటివ్ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 36,05,783 కేసులతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ నెల చివరి నాటికి భారత్ రెండో స్థానానికి చేరడం ఖాయం.