సీఎం కేసీఆర్ దృష్టంతా ఇప్పుడు దాని మీదే
By అంజి Published on 18 Jan 2020 11:35 AM GMTరాజన్న సిరిసిల్ల: వేములవాడలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్బాబుతో కలిసి ఇవాళ వేములవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడ అభివృద్ధికి ఏ ప్రభుత్వమైనా కృషి చేసిందా అని ప్రశ్నించారు. రాజన్న ఆలయ అభివృద్ధికి వీటీడీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వేములవాడ, సిరిసిల్ల అభివృద్ధే తన ధ్యేయమని కేటీఆర్ వ్యాఖ్యనించారు. గెలిచినవారు పనిచేయకపోతే వారిని పదవి నుంచి తొలగిస్తామన్నారు. రోడ్ షోలో ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
రాబోయే రోజుల్లో ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి ఆలయ పనులు తర్వలోనే పూర్తి కానున్నాయని, సీఎం కేసీఆర్ దృష్టంతా ఇక వేములవాడ, భద్రాచలంపైనేనన్నారు. బీజేపీకి పని తక్కువ బిల్డప్ ఎక్కువ అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వమంటే మోదీ పట్టించుకోలేదన్నారు. చెరువుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఇవ్వమంటే మోదీ ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. వేములవాడ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి.. ఇక పట్టణాల దశ మారుస్తామన్నారు. వేములవాడను ఆదర్శ మున్సిపాలిటీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.