బావా త్వరగా కోలుకో.. ఆ న‌మ్మ‌కం నాకుంది.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 8:01 AM GMT
బావా త్వరగా కోలుకో.. ఆ న‌మ్మ‌కం నాకుంది.!

తెలంగాణ రాష్ట్ర‌ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌ హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా అభిలషించారు. తాజ‌గా హరీశ్ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు.

కేటీఆర్ ట్వీట్‌లో.. ‘బావా త్వరగా కోలుకో.. ఇతరులకంటే త్వరగా కోలుకుంటావన్న నమ్మకం నాకుంది’ అని రాసుకొచ్చారు. ఇదిలావుంటే.. సోమవారం(సెప్టెంబ‌ర్ 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

ఆ పరీక్షల్లోనే హరీశ్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. తనను కలిసిన ప్రజాప్రతినిధులు, అధికారులను టెస్ట్ చేయించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది.

తాజాగా గడిచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తంగా 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,38,395 కేసులు నమోదు కాగా, మొత్తం 877 మంది మృతి చెందారు.

Next Story