మంత్రి హ‌రీష్‌రావుకు క‌రోనా పాజిటివ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 5:42 AM GMT
మంత్రి హ‌రీష్‌రావుకు క‌రోనా పాజిటివ్‌

తెలంగాణ‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా అధిక సంఖ్య‌లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికీ ఈ మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా మంత్రి హ‌రీష్ రావుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ మేర‌కు ఆయ‌న క‌రోనా సోకిన‌ట్లుగా ట్వీట్ చేశారు.

కరోనా లక్షణాలు క‌నిపించ‌డంతో వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో హోం క్వారంటైన్ అయ్యాను. ప్ర‌స్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. గ‌డిచిన కొద్ది రోజులుగా న‌న్ను కాంంటాక్ట్ అయిన వారంద‌రు టెస్టులు చేయించుకోని త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోగ‌ల‌ర‌ని హ‌రీష్‌‌రావు ట్వీట్‌లో కోరారు.



ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,511 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తంగా 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,38,395 కేసులు నమోదు కాగా, మొత్తం 877 మంది మృతి చెందారు.

ఇక తాజాగా కరోనా నుంచి 2,579 మంది కోలుకోగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,04,603 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.63 శాతం ఉండగా, దేశంలో 1.73 శాతం ఉంది. ఇక కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 75.5 శాతం ఉండగా, దేశంలో 77.24 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. అలాగే హోమ్‌ ఐసోలేషన్‌లో 25,729 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story