ఈ ‘డాక్టర్’ గురించి వింటే వణుకే.. వందమందిని హత్య చేశాడు

By సుభాష్  Published on  30 July 2020 6:23 AM GMT
ఈ ‘డాక్టర్’ గురించి వింటే వణుకే.. వందమందిని హత్య చేశాడు

డాక్టర్ ప్రాణం పోస్తాడు. కానీ.. వీడు మాత్రం ప్రాణాలు తీస్తాడు. ఎంబీబీఎస్ చేయకున్నా డాక్టర్ గా పరిచయం చేసుకోవటమే కాదు.. కిడ్నీ మార్పిడితో పాటు.. అవయువాల మార్పి శస్త్రచికిత్సల్ని చేసే టాలెంట్ ఉన్న ఇతగాడి గురించి తెలిసినంతనే షాక్ తినక మానదు. చూసినంతనే వయసు మీద పడుతున్న పక్కింటి అంకుల్ కు ఏమాత్రం తేడా లేని రీతిలో ఉండే ఇతగాడి పేరు డాక్టర్ శర్మ అలియాస్ డాక్టర్ దేవేంద్ర శర్మగా చెబుతుంటారు. పోలీసు రికార్డుల్లో అతడి నేరాల గురించి వింటే మైండ్ బ్లాక్ కావాల్సిందే.

ఏకంగా వంద మందిని హత్య చేసిన ఇతడ్ని పట్టుకోవటానికి విపరీతంగా ప్రయత్నించిన పోలీసులు ఎట్టకేలకు అతడి సమాచారాన్ని సేకరించి.. పక్కా ప్లానింగ్ తో అతడ్ని అదుపులోకి తీసుకొన్నారు. 62 ఏళ్ల వయసులో ఉన్న అతడు ఒక వితంతువును పెళ్లాడి రహస్యంగా జీవిస్తున్నాడు. తాను చేసిన హత్యలు వంద దాటటంతో ఇటీవల హత్యలకు పుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పిన వైనం వింటే.. వణుకు పుడుతుంది.

అంతేకాదు.. అతగాడు చంపినోళ్లంతా వాహన డ్రైవర్లే కావటం గమనార్హం. ఇంతమందిని చంపి.. వారినేం చేశాడన్నది తెలిస్తే మరింత టెర్రర్ కావటం ఖాయం. తాను చంపినోళ్లను హజా కాలువలో మొసళ్లకు ఆహారంగా వేసేవాడు. దీంతో.. వారి ఆనవాళ్లను కూడా ఎవరూ గుర్తించలేని పరిస్థితి. ఇక.. తాను హత్య చేసిన డ్రైవర్ల వాహనాల్ని తుక్కు కింద చేసి.. అమ్మేసేవాడు. దీంతో.. ఒక్కోవాహనం కింద అతనికి రూ.25వేల వరకు వచ్చేవి.

హర్యానాకు చెందిన ఈ కిల్లర్ డాక్టర్.. దేశంలోని పలు రాష్ట్రాల్లో నడిచే కిడ్నీ రాకెట్లలో కీలకమని చెబుతారు. దాదాపు 125 మందికి కిడ్నీలు తొలగించిన ట్రాక్ రికార్డు అతడి సొంతం. ఇతగాడి నేరాల చిట్టా అంతకంతకూ పెరిగిపోవటం.. మోస్ట్ వాంటెడ్ కిల్లర్ గా మారిన ఇతడ్ని అదుపులోకి తీసుకునేందుకు హర్యానా.. రాజస్థాన్ పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా అతడు ఢిల్లీలో దాక్కున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్ తో అతడ్ని అరెస్టు చేశారు. ఇతన్ని విచారించిన సమయంలో అతను అసలుసిసలు డాక్టర్ కాదని.. బీఏఎంఎస్ డిగ్రీ మాత్రమే ఉందని గుర్తించారు. తాను చేసిన హత్యలు వంద దాటిపోవటంతో ఇటీవల కాలంలో తాను చేస్తున్న హత్యలకు పుల్ స్టాప్ పెట్టినట్లు చెప్పి పోలీసులకు మరో షాకిచ్చాడట.

Next Story