ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించం - సీఎం కేసీఆర్

By Medi Samrat  Published on  12 Oct 2019 12:43 PM GMT
ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించం - సీఎం కేసీఆర్

మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించమన్నారు. సమ్మె చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు కూడా జరపదన్నారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని.. తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సీఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అలాగే...50శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. 30 శాతం బస్సులు అద్దె ప్రాతిపదికన, 20శాతం ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని ఆదేశించారు

సీఎం.

Related image

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ‌నివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

"ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలన్నారు సీఎం కేసీఆర్‌. దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలన్నారు. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలని సూచించారు అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలి" అని సిఎం ఆదేశించారు.

'ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బదిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి. మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20 శాతం(2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిషన్లు ఇవ్వాలి. దీనికోసం అవసరమైన కసరత్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు.

Image result for tsrtc strike

'యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారని సీఎం అన్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని సీఎం స్ప‌ష్టం చేశారు.

పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి.. ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదన్నారు సీఎం కేసీఆర్‌. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదని.. అది చట్ట విరుద్ధమైందన్నారు. ప్రజలకు అసౌకర్యం కల్పించే చర్య మాత్రమేన‌ని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికులకు సెప్టెంబర్ నెల జీతం వెంటనే విడుదల చేస్తామ‌ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికమ‌ని ప్ర‌తిప‌క్షాల‌పై సీఎం ఫైర్ అయ్యారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదని అన్నారు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదని.. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ అనే విధంగా ఉందని అన్నారు.

Related image

ప్ర‌తిప‌క్షాలు రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయని మండిప‌డ్డారు సీఎం కేసీఆర్. వారి ఆశ ఫలించదని.. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి ఛీత్కారం తప్పదన్నారు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారని.. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారని చెప్పారు సీఎం.

సమీక్ష సమావేశం నుండే సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ‘ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండని.. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయ‌వ‌ల‌సిందిగా కోరారు. మహిళా పోలీసులను.. నిఘా పోలీసులనూ ఉపయోగించవ‌ల‌సిందిగా కోరారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై త‌క్ష‌ణ‌మే కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని అన్నారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదని డీజీపీని సీఎం ఆదేశించారు.

మూడు, నాలుగు రోజుల్లోనే వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నామ‌ని.. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలని కోరారు. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలని చెప్పారు. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. బస్ పాస్ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దని.. బస్ పాసులున్న విద్యార్థులు యథావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చని సీఎం ప్రకటించారు.

Next Story