కరోనాపై పోరు.. వ్యాక్సిన్‌ కోసం రంగంలోకి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

By అంజి  Published on  31 March 2020 4:49 PM GMT
కరోనాపై పోరు.. వ్యాక్సిన్‌ కోసం రంగంలోకి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

ముఖ్యాంశాలు

  • కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్‌ తయారీలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌
  • కరోనా నియంత్రణకు ఓ వ్యాక్సిన్‌ను ఎంచుకున్నట్లు వెల్లడి
  • ఈ ఏడాది సెప్టెంబర్‌లో మనుషులపై ప్రయోగించనున్నారని సమాచారం

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు పలు అంతర్జాతీయ ఔషధ సంస్థలు రంగంలోకి దిగాయి. కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ కోసం శాస్త్రవేత్తలు తీవ్ర కసరత్తు మొదలు పెట్టారు. వివిధ ఔషధ కంపెనీలు మందు కనిపెట్టేందుకే తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

తాజాగా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఔషధ తయారీ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కూడా రంగంలోకి దిగింది. వైరస్‌ నియంత్రణకు తాము ఓ వ్యాక్సిన్‌ ఎంచుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో మనుషులపై ప్రయోగిస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి అత్యవసర వినియోగం కోసం ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెస్తామంటూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్‌ తయారీ కోసం అమెరికా ప్రభుత్వ రంగ సంస్థతో బీఏఆర్డీఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ తయారీ కోసం రూ.ఏడు వేల కోట్లను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పెట్టుబడిగా పెట్టనుంది.

Also Read: కరోనా కేసులపై మర్కజ్‌ నిజాముద్దీన్‌ అధికారిక ప్రకటన

అయితే ఇప్పటికే కరోనా వైరస్‌కు సంబంధించి పలు వ్యాక్సిన్‌లను ఎంచుకున్నామని, వాటిని జంతువులపై కూడా ప్రయోగించామని తెలిపింది. అందులో ఉత్తమమైనది ఎంచుకోవడానికి మరో రెండు వారాల పాటు సమయం పడుతుందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వెల్లడించింది.

కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ ఇప్పటి వరకు విజయవంతం కాలేదని తెలిపింది. అయితే సార్స్‌ నియంత్రణ తయారీ బృందంతో పని చేయడం వల్ల కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆ సంస్థ పేర్కొంది.

Next Story