ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 2:46 PM IST
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్టూల్ అసిస్టెంట్లు 2,299, టీజీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు విద్యాశాఖ అధికారులు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ను నిర్వహించనున్నారు.
2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుంది. జనరల్ కేటగిరి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 44 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి మరో ఐదేళ్లు పెంచారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు cse.apgov.in వెబ్సైట్ను సందర్శించండి.