రాష్ట్రానికి కొత్త లోగో.. ప్రభుత్వం నిర్ణయం
By సుభాష్
భారత 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త లోగోను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను సీఎం హేమంత్ సోరెన్ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. లోగో రూపకల్పనలో తమవంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు ఫిబ్రవరి 11వ తేదీలోగా ప్రజలు తమ సూచనలు, సలహాలను 'jharkhandstatelogo@gmail.com' కు తెలియజేయాలని సర్కార్ కోరింది.
ఇక ముఖ్యమంత్రిగా హేమంత్ భాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ సమావేశంలో ఈ కొత్త లోగో ఏర్పాటుపై చర్చ జరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి కొత్త లోగోను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ సమున్నత సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉండబోతోందని హేమంత్ సర్కార్ పేర్కొంది.