రైతులకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త
By సుభాష్ Published on 10 Oct 2020 3:21 AM GMT
ఏపీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త వినిపించింది. ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు ఉచిత పంట బీమాను అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందు కోసం రూ.101 కోట్లను విడుదల చేసింది ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా ఈ బీమాను అమలు చేసింది ప్రభుత్వం. కాగా, ఈ-పంటలో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే ఈ ఉచిత బీమా వర్తించనుంది.
నవశకం కార్యక్రమం ద్వారా తెల్లరేషన్ కార్డులు
సీఎం జగన్ సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. గత రెండు రోజుల కిందట జగనన్న విద్యాకానుక పథకానికి శ్రీకారం చుట్టిన జగన్ సర్కార్.. నిరుపేదలకు మరో శుభవార్త వినిపించింది. నవశకం కార్యక్రమం ద్వారా తెల్లరేషన్ కార్డులు పొందనివారు, మరోసారి కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగివున్నవారు, అత్యధిక విద్యుత్ వినియోగం, ఇతర కారణాల వల్ల నవశకం కార్యక్రమంలో తెల్లరేషన్ కార్డుకు అనర్హులైన లబ్ధిదారులు సరైన ఆధారాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం అంజాద్భాషా వెల్లడించారు.
తెల్లరేషన్ కార్డు కోసం లబ్దిదారులు తమ సమీపంలోని గ్రామ, వార్డు సచివాయాల్లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు ఫారంతో కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు కూడా జత చేయాలని సూచించారు. ఆ దరఖాస్తులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పరిశీలిస్తారిన, తద్వారా అనర్హత పొందిన వారు మరలా తెల్లరేషన్కార్డు పొందే అవకాశం ఉంటాయని మంత్రి తెలిపారు.