పేదలకు సీఎం జగన్ మరో బంపర్ ఆఫర్! ఏమిటంటే..
By Medi Samrat Published on 18 Oct 2019 12:20 PM ISTఅమరావతి : పేదలకు సీఎం జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు సెంట్లలోపు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే పేదలకు రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుమించితే క్రమబద్దీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నదీ తీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్న నేపథ్యంలో స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థలం ఇచ్చినా.. రిజిస్ట్రేషన్ చేసే వారు కాదని, ఇప్పుడు చేయాలన్నారు.
ఇళ్ల నిర్మాణాలకు వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని, ఇళ్ల స్థలాలు పొందే లబ్దిదారుల జాబితాలను వీధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని సంప్రదించాలని వంటి సూచనలు కూడా ఇవ్వాలన్నారు.ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే.. అందుకు గల కారణాలను కూడా వారికి తెలియచేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఇళ్ల పట్టాలిచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని, లబ్దిదారుల నుంచి జనవరి వరకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు.