అంత‌ర్జాతీయ కోర్టులో చైనాపై కేసు వేయ‌నున్నారా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2020 6:51 AM GMT
అంత‌ర్జాతీయ కోర్టులో చైనాపై కేసు వేయ‌నున్నారా..?

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఎక్క‌డో చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి అన్ని దేశాలకు స‌వాల్ విసురుతోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 13వేల మంది మృత్యువాత ప‌డ‌గా.. 3ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

తాజాగా భార‌త్‌లో కూడా క‌రోనా కేసుల సంఖ్య 324కు చేరింది. వుహాన్‌లో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి చైనా కంటే ఇట‌లీనే ఎక్కువ‌గా భ‌య‌పెడుతోంది. రోజు రోజుకు ఇట‌లీలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతోంది. శ‌నివారం ఒక్క‌రోజే 793 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇట‌లీలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,857కు చేరింది.

ఇదిలా ఉంటే.. చైనాలో పుట్టిన ఈ మ‌హ‌మ్మారి ఇప్ప‌టికే.. వేలాదిమంది ప్రాణాలు బలిగొని, లక్షలాదిమందిని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ విషయంలో మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేయని చైనాపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతక మహమ్మారిపై మిగతా ప్రపంచాన్ని అప్రమత్తం చేయనందుకు ఆ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు వేయొచ్చని ఇజ్రాయెల్ న్యాయ నిపుణుడు నిసాన్ దర్శన్ లీటర్న్ తెలిపారు.

ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న కోణంలో చైనాపై వాదించొచ్చని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రపంచానికి ముప్పు తేవడంతోపాటు వైరస్ సమాచారాన్ని దాచిపెట్టినందుకు గాను న్యాయపరంగా చైనాను ప్రశ్నించొచ్చని వివరించారు. కాగా, కోవిడ్-19 వెలుగు చూసిన మూడు వారాల్లోనే చర్యలు కనుక తీసుకుని ఉంటే 95 శాతం నియంత్రించే వీలుండేదని ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ తెలిపింది.

Next Story