కచ్ ప్రాంతంలో బయటపడ్డ ఇనుప యుగపు ఆనవాళ్లు
By అంజి Published on 23 Nov 2019 6:02 AM GMTగుజరాత్లోని కరీమ్ షాహీ ప్రాంతంలో ఇనుప యుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ వస్తువులు 3 వేల ఏళ్ల క్రి తం మనుషులు ఉపయోగించినవని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం కచ్ ప్రాంతంలో ఉన్న ఉప్పు నేలకు సమీపంలోని కరీం షాహి, విగకోట్ ప్రాంతాల్లో ఇనుప యుగం ఉన్నట్టు వారు పేర్కొన్నారు. థార్ ఎడారి సమీపంలో, పాక్ సరిహద్దు ప్రాంతంలో సుమారు మూడు వేల ఏళ్ల క్రితం జనావాసాలు ఉన్నట్టు సాక్షాలు దొరికాయని ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు గుర్తించారు. సుమారు మూడేళ్ల పాటు పరిశోధకులు ఇక్కడ విస్తృత తవ్వకాలు నిర్వహించగా ఈ విషయాలు బయట పడినట్లు తెలుస్తోంది.
ఋతుపవనాల క్షీణత, తీవ్రమైన కరువు తో సింధు నాగరికత అంతరించి పోయిన తర్వాత ఇనుప యుగం మొదలైంది. ఇక్కడ జరిగిన తవ్వకాలలో లెక్కకు మించిన కళాకృతులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతానికి అక్కడ నివాసాలకు అనుకూలంగా లేదు. దీంతో ఆ కాలంలోనే వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ గుజరాత్ నుంచి తూర్పు దిశగా ప్రజలు భారీ వలసలకు వెళ్ళిపోయి ఉంటారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఒకప్పుడు థార్ ఎడారి ప్రాంతంలో నదిలకు కొదవలేదని, తరువాత జరిగిన వాతావరణ మార్పులు హరప్పా నగరాల్లో నీటి చుక్క లేకుండా చేసాయి అంటున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఐఐటీ విద్యార్థులు ఈ పరిశోధనలు నిర్వహించారు.