ఘనంగా రచయితల సంఘం రజతోత్సవ వేడుక టీజర్ ఆవిష్కరణ
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 Oct 2019 10:32 AM GMT24 క్రాఫ్ట్లలో అతి ముఖ్యమైనది రచనా విభాగం. అటువంటి రచనా విభాగానికి పుట్టిల్లు తెలుగు సినీ రచయితల సంఘం. తెలుగు సినీ రచయితల సంఘానికి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2019 నవంబర్ 3వ తారీఖున హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తెలుగు సినీరచయితల సంఘం రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పలువురు అగ్ర రచయితలు పాల్గొని 1932 దశకం నుంచి ఈ దశకం వరకు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం వచ్చిన సినీ రచయితల కృషిని గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక టీజర్ను రెబల్ స్టార్ కృష్ణంరాజు విడుదల చేశారు. కార్యక్రమం బలభద్రపాత్రుని రమణి స్వాగతంతో ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ… రచయితల సంఘం అనే కంటే ‘సరస్వతీ పుత్రి- పుత్రికల సంఘం’ అంటాను నేను. ఎందుకంటే మా నాన్న గారు చెప్పారు ‘లక్ష్మి ఎదురు వస్తే నమస్కరించు…కానీ సరస్వతి ఎక్కడవున్నా వెళ్లి నమస్కరించమని’. రచయితలకు కాన్సన్ట్రేషన్, అంకితభావం వుండాలి. అలా ఎంతోమంది పెద్దలున్నారు. ప్రస్తుతం కాలంతోపాటు రచనల్లో మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే రచయితలు వుంటారు. పిల్లలకు మనం ఏం చెబితే దాన్నే ఆచరిస్తారు. అదేవిధంగా రచయితలు రాసిన మాటలే ప్రేక్షకుల్లో పాపులర్ అవుతాయి. మంచి మార్గంలో దోహదపడేలా వుండాలి. నేను చాలా పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదన్నా సీన్ రాసే ముందు ఆయన ఆ క్యారెక్ట్లోకి వెళ్లిపోయి డైలాగ్లు రాస్తారు. రచయితలు మహానుభావులు వంటివారు. నేను రచయితల సంఘం సభ్యుడినే అని కృష్ణంరాజు అన్నారు.