నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: వివేకా కుమార్తె సునీత

గత ఐదేళ్లుగా వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హంతకులను కఠినంగా శిక్షించాలని న్యాయ పోరాటం చేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 April 2024 8:19 AM GMT
ys sharmila, avinash reddy,  sunitha narreddy,

నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే: వివేకా కుమార్తె సునీత

గత ఐదేళ్లుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి తన తండ్రి హంతకులను కఠినంగా శిక్షించాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. డాక్టర్ సునీత న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. తన తండ్రి హత్య వెనుక చోటు చేసుకున్న కుట్ర గురించి ప్రజలకు తెలియజేయడానికి ఆమె ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే కడప లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్‌ షర్మిల తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దోషులకు అధికారం దూరం చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని ఆమె అంటున్నారు. ప్రతీకారం తీర్చుకోవడం నా లక్ష్యం కాదు.. న్యాయం దక్కించుకోవడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు.

న్యూస్‌మీటర్‌కి ఫ్రీ-వీలింగ్ టాక్ ఇంటర్వ్యూలో.. డాక్టర్ సునీత తన తండ్రిని హత్యచేసిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారనే అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.

NM: ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారణం ఏమిటి? వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని మీరు ఎలా నిర్ధారిస్తారు?

సునీత: 2009కి ముందు కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (వైఎస్‌ఆర్‌) లేదా మా నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి పోటీ చేశారు. 2009లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఎంపీగా పంపారు. వైఎస్ఆర్ మరణానంతరం పులివెందుల నుంచి ఓ వ్యక్తిని రంగంలోకి దింపాలని చర్చలు జరిగాయి. వైఎస్ భాస్కర్ రెడ్డిని అభ్యర్థిగా భావించారు. అయితే ఆయనను పంపించడం మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డికి నచ్చలేదు. బదులుగా పులివెందుల నుంచి వైఎస్‌ఆర్‌ భార్య విజయమ్మ లేదా ఆయన కుమార్తె వైఎస్‌ షర్మిలను ఎంపిక చేయాలని సూచించారు.

ఆ తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ మంత్రిగా ప్రతిపాదించింది. ఈ నిర్ణయం వైఎస్‌ జగన్‌కు నచ్చలేదు. అందుకే వైఎస్ జగన్.. ఆయన తల్లి పార్టీకి రాజీనామా చేశారు. 2011 ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఓటమి తర్వాత వైఎస్‌ వివేకానందరెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్‌ జగన్‌ను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జైలుకు పంపినప్పుడు వైఎస్‌ షర్మిల పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో వైఎస్ షర్మిలకు కడప లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందని పలువురు నేతలు భావించారు. అది నాన్నకు నచ్చలేదు. ఆ తర్వాత 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ అవినాష్‌రెడ్డి వెన్నుపోటుతో వైఎస్‌ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. నా మూర్ఖత్వం కారణంగా, నా తండ్రి మరణంలో మా సొంత కుటుంబానికి సంబంధం లేదని నేను నమ్మాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అది.

NM: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఎందుకు లేవనెత్తారు? ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?

సునీత: గత ఐదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాను. నిందితుడు ఎవరో తెలిసినా వైఎస్ జగన్ కాపాడాలని అనుకోవడమే కాకుండా కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం. నేను సాధారణ మనిషిని, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తెను. ప్రజలు తమ ఓటు ద్వారా నిందితులను అధికారం నుంచి దింపినప్పుడే న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను.

NM: మొదట్లో మీ రాజకీయ ప్రవేశంపై పుకార్లు వచ్చాయి. ఏదైనా రాజకీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా?

సునీత: రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే తీసుకున్నాను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక లేదా ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలన్న కోరిక అయితే నాకు లేదు. ప్రతీకారం తీర్చుకోవడం నా కోరిక కాదు. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఓడిపోయిన తర్వాత న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాను. వ్యవస్థను బలోపేతం చేయడం, న్యాయం కోసం పోరాడుతున్న నాలాంటి వారికి అండగా నిలబడడమే నా లక్ష్యం.

NM: వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా టీడీపీ మీకు మద్దతు ఇస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానిపై మీ కామెంట్స్ ఏమిటి? న్యాయం కోసం ఏదైనా రాజకీయ పార్టీని సంప్రదించారా?

సునీత: ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలు. వీటి వెనుక వైఎస్సార్‌సీపీ ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి పార్టీలోని పలువురు నేతలకు తెలుసు. చాలా మంది భయపడి మౌనంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం నా వెనుక ఉంది. రాజకీయాలకు అతీతంగా నా తండ్రికి న్యాయం చేయాలంటూ నేతలను కలిశాను.

NM: కడపలో వైఎస్‌ షర్మిలకు మీ నుంచి ఎలాంటి సపోర్ట్‌ ఆశిస్తున్నాం?

సునీత: కడప లోక్‌సభ స్థానం నుంచి ఆమె అభ్యర్థిత్వానికి కచ్చితంగా మద్దతిస్తాను. కడపలో ఆమె గెలుపు కోసం ప్రచారాన్ని ప్రారంభించి, రాబోయే రోజుల్లో కూడా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తాను. కడప లోక్‌సభ స్థానంలో వైఎస్‌ షర్మిల గెలిస్తే వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అధికారం దక్కదు. కనీసం ఆ సమయానికైనా అతను వ్యవస్థను ప్రభావితం చేయలేకపోవచ్చు. అప్పుడే కోర్టుల ద్వారా దోషిగా నిరూపించడానికి అవకాశం ఉంది. అలా నాకు న్యాయం జరుగుతుంది.

Next Story