ఇరాన్ ఓడరేవుల్లోకి వెళ్లే అన్ని దేశాల నౌకలపై అమెరికా దిగ్బంధనం
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఏప్రిల్ 13, సోమవారం ఉదయం 10 గంటల (ET) నుండి ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
By - అంజి |
ఇరాన్ ఓడరేవుల్లోకి వెళ్లే అన్ని దేశాల నౌకలపై అమెరికా దిగ్బంధనం
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఏప్రిల్ 13, సోమవారం ఉదయం 10 గంటల (ET) నుండి ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనకు అనుగుణంగా, ఇరాన్ తీర ప్రాంతాలు, ఓడరేవుల ద్వారా ప్రయాణించే అన్ని దేశాల నౌకలను సమానంగా అడ్డుకుంటామని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. అయితే, ఇరాన్ కాని ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకల ప్రయాణ స్వేచ్ఛకు ఎలాంటి అంతరాయం కలిగించబోమని పేర్కొంటూ, కమర్షియల్ షిప్పింగ్ సంస్థలు అధికారిక నోటీసులను గమనిస్తూ ఉండాలని సూచించింది.
ముఖ్యంగా పెట్రోడాలర్ వ్యవస్థకు సవాలుగా మారుతున్న చైనా యువాన్ (Yuan) కరెన్సీ వినియోగాన్ని అడ్డుకోవడమే ఈ దిగ్బంధనం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇరాన్ మీదుగా వెళ్లే నౌకలు 'అక్రమ టోల్' వసూళ్లు చెల్లిస్తున్నాయని, వీటిని అరికట్టడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. చైనా మరియు ఇరాన్ దేశాలు అమెరికా ఆర్థిక ఆంక్షలను ధిక్కరిస్తున్న నేపథ్యంలో, వాషింగ్టన్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
దీనిపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఈ దిగ్బంధనం వల్ల అమెరికాలోనే ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని ఆయన హెచ్చరించారు. "ప్రస్తుతం గ్యాస్ స్టేషన్లలో ఉన్న ధరలను చూసి ఆనందించండి.. ఈ దిగ్బంధనం వల్ల త్వరలోనే మీరు 4 నుంచి 5 డాలర్ల ధరల కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుంది" అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మరియు అమెరికా యుద్ధనౌకల మధ్య ముఖాముఖి ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ హెచ్చరికల వల్ల అమెరికా యుద్ధనౌకలు వెనక్కి తగ్గాయని ఇరాన్ ప్రకటించగా, అమెరికా ఆ వార్తలను ఖండించింది. తమ నౌకలు యధావిధిగా ప్రయాణాన్ని పూర్తి చేశాయని CENTCOM స్పష్టం చేసింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తున్నాయి.