అమెరికన్లకు ఉద్యోగాల్లో పోటీ తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. H1B వర్కర్ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు (ఇదివరకు $1500 ఉండేది) చెల్లించాలన్న ఉత్తర్వులపై సంతకం చేశారు. H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయ. అక్కడ ఎంఎస్ చదివేందుకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే ఎంఎస్ పూర్తి చేసిన వారు లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీని అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీని వల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు వీలు ఉండదు.
కాగా గతేడాది భారతీయులకే H1B వీసాలు 71 శాతం దక్కాయి. వీదేశీయులకు ఉద్యోగాలు ఇచ్చే బదులు స్థానిక యువతలో నైపుణ్యం పెంచి, ఉపాధి కల్పించాలని కంపెనీలకు ట్రంప్ పిలుపునిచ్చారు. అటు గోల్డ్ కార్డ్ వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా ట్రంప్ సంతకం చేశారు. యూఎస్ వెళ్లాలనుకునే వారు 10 లక్షల డాలర్లు (8.8 కోట్లు) కట్టి ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసం అయితే 20 లక్షల డాలర్లు కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్తో సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.