ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ ఖార్గ్ ఐలాండ్పై మెరుపు దాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి.
By - అంజి |
ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ ఖార్గ్ ఐలాండ్పై మెరుపు దాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్ ఆర్థిక వెన్నెముకగా భావించే ఖార్గ్ ఐలాండ్ పై అమెరికా దళాలు భారీ వైమానిక దాడులు జరిపినట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ దాడుల్లో ద్వీపంలోని సైనిక స్థావరాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్పై అమెరికా సెంట్రల్ కమాండ్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబు దాడులను నిర్వహించింది. ఈ మేరకు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా వివరాలను వెల్లడించారు.
ఖార్గ్ ఐలాండ్లోని ప్రతి సైనిక కేంద్రాన్ని అమెరికా దళాలు ధ్వంసం చేశాయని ట్రంప్ ప్రకటించారు. దీనిని ఇరాన్ యొక్క 'క్రౌన్ జువెల్' (కిరీటంలో మణి) గా ఆయన అభివర్ణించారు. మానవతా దృక్పథంతో తాము ప్రస్తుతానికి చమురు నిల్వ కేంద్రాలను, మౌలిక సదుపాయాలను తాకలేదని ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఇరాన్ లేదా మరే దేశమైనా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలను అడ్డుకుంటే, తదుపరి లక్ష్యం ఇరాన్ చమురు నిల్వలేనని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను పొందలేదని, అమెరికా లేదా ప్రపంచ దేశాలను భయపెట్టే స్థాయికి ఆ దేశాన్ని ఎదగనివ్వబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు.
ఖార్గ్ ఐలాండ్ ఎందుకు అంత ముఖ్యం?
ఖార్గ్ ఐలాండ్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు వంటిది. ఇరాన్ ముడి చమురు ఎగుమతులలో 90 శాతం వాటా ఈ ద్వీపం నుండే జరుగుతుంది. చైనా వంటి దేశాలకు వెళ్లే చమురు ట్యాంకర్లన్నీ ఇక్కడే లోడ్ అవుతాయి. ఈ ద్వీపంపై దాడి జరిగితే ఇరాన్ ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది.
డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు:
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ దాడులకు ముందే ఒక ప్రకటన చేస్తూ, "నేడు ఇరాన్పై అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన దాడులు జరగబోతున్నాయి" అని పేర్కొన్నారు. ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యాన్ని ప్రపంచం ముందెన్నడూ చూడని వేగంతో దెబ్బతీస్తామని ఆయన స్పష్టం చేశారు.