అమెరికా-ఇరాన్ చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం?.. శాంతి దిశగా ట్రంప్ కీలక అడుగులు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By - అంజి |
అమెరికా-ఇరాన్ చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం?.. శాంతి దిశగా ట్రంప్ కీలక అడుగులు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చేందుకు అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ వారంలోనే ఇరు దేశాల ప్రతినిధులు పాకిస్థాన్లో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఈ సంక్షోభ పరిష్కారం కోసం పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ దేశాలు తెరవెనుక తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడి, ప్రాంతీయ శాంతి కోసం తమ మద్దతును ప్రకటించారు. అదేవిధంగా, పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అటు ఇరాన్ అధ్యక్షుడితోనూ, ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు విడివిడిగా చర్చలు జరిపారు.
మరోవైపు, చర్చల పురోగతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో ఇప్పటికే పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దౌత్యానికి అవకాశం కల్పించేందుకు ఐదు రోజుల పాటు సైనిక చర్యలను నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. అయితే, అమెరికా వాదనలను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. గత 24 రోజులుగా తాము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదని ఇరాన్ ప్రతినిధి స్పష్టం చేయడం గమనార్హం.