ఇస్లామాబాద్ చర్చలు విఫలం.. అమెరికా కీలక ప్రకటన
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన మలుపు తిరిగాయి. గత 40 రోజులుగా మధ్యప్రాచ్యంలో సాగిన యుద్ధం తర్వాత...
By - అంజి |
ఇస్లామాబాద్ చర్చలు విఫలం.. అమెరికా కీలక ప్రకటన
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరోసారి ప్రతిష్ఠాత్మకమైన మలుపు తిరిగాయి. గత 40 రోజులుగా మధ్యప్రాచ్యంలో సాగిన యుద్ధం తర్వాత రెండు వారాల పాటు ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతిగా మార్చేందుకు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) అసంతృప్తితో వెనుదిరిగారు.
ఇరాన్ భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయబోమని మరియు దానికి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయబోమని ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు ధ్వంసమైనప్పటికీ, దీర్ఘకాలికంగా ఆ దేశ ఉద్దేశ్యంపై నమ్మకం కలగడం లేదని అమెరికా భావిస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధిని తిరిగి ప్రారంభించే విషయంలో కూడా ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.
తమ 'రెడ్ లైన్స్' విషయంలో అమెరికా చాలా స్పష్టంగా ఉందని, ఏయే విషయాల్లో వెనక్కి తగ్గుతామో, వేటిలో తగ్గమో వివరించామని వాన్స్ తెలిపారు. అయితే అమెరికా పెట్టిన నిబంధనలను అంగీకరించేందుకు ఇరాన్ మొగ్గు చూపలేదు. చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడిన వాన్స్, ఇరాన్తో చర్చలు జరపడం మంచి విషయమే అయినప్పటికీ, ఒప్పందం కుదరకపోవడం అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని వ్యాఖ్యానించారు. ఇరాన్ తన పంథాను మార్చుకుని అణ్వాయుధ రహిత హామీ ఇస్తేనే శాంతి సాధ్యమవుతుందని అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి గల్ఫ్ రీజియన్లో దీర్ఘకాలిక శాంతి కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.