చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది: డోనాల్డ్ ట్రంప్

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఏకంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పైనే కాల్పులు జరిపారు.

By Srikanth Gundamalla  Published on  14 July 2024 3:55 AM GMT
trump, gun fire, bullet, ear,

చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది: డోనాల్డ్ ట్రంప్ 

అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఏకంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పైనే కాల్పులు జరిపారు. పెన్విల్వేనియా ర్యాలీలో జరిగిన కాల్పుల్లో ట్రంప్‌కు గాయం అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. కాల్పుల్లో ఓ బుల్లెట్ తన కుడి చెవి పైభాగంలో నుంచి దూసుకెళ్లిందని చెప్పారు. ట్రుత్‌ సోషల్‌ మీడియా వేదిగా ఈ విషయం వెల్లడించారు. సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది తన ప్రాణాలను కాపాడారని అన్నారు. సిబ్బందికి ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు మాట్లాడిన ట్రంప్.. 'కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సహా మిగతా సిబ్బందికి ధన్యవాదాలు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి చర్య అమెరికాలో చోటుచేసుకోవడం నమ్మశక్యంగా లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి తెలియదు. నా కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్‌ వెళ్లింది. కాల్పల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. అంతలోనే చెవికి బుల్లెట్ తగిలింది. చాలా రక్తస్రావం జరిగింది.' అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 గంటలకు జరిగింది. ఈ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. మీయడి ప్రత్యక్షప్రసారం చేస్తుండగానే ఈ ఘోరం జరిగింది. కాల్పుల దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పైనుంచి దూసుకెళ్లడం, ఆయనకు రక్తస్రావం కావడం టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విని వెంటనే అప్రమత్తమైన ట్రంప్‌ పోడియం కింద చేరి తనని రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సిబ్బంది ఆయన్ని కాపాడి తీసుకెళ్లారు. ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగులు దగ్గర్లో ఉన్న భవనంపై నుంచి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు. దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story