ఇరాన్ అతలాకుతలం: 787కు చేరిన మృతుల సంఖ్య.. హోర్ముజ్ జలసంధి మూసివేత!

ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నాలుగో రోజుకు చేరాయి. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీతో...

By -  అంజి
Published on : 3 March 2026 3:53 PM IST

Ayatollah Ali Khamenei death, Iran-Israel War 2026, US Embassy Riyadh Attack, Strait of Hormuz closed, Iran Red Crescent death toll, Middle East Conflict, Global Oil Market Impact

ఇరాన్ అతలాకుతలం: 787కు చేరిన మృతుల సంఖ్య.. హోర్ముజ్ జలసంధి మూసివేత!

ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు నాలుగో రోజుకు చేరాయి. ఈ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కీలక సైనిక కమాండర్లు మరణించడంతో ఇరాన్ కోపంతో రగిలిపోతోంది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక ప్రకారం, మంగళవారం నాటికి మరణించిన వారి సంఖ్య 787కు చేరుకుంది. సోమవారం ఈ సంఖ్య 555గా ఉండగా, దాడుల తీవ్రత పెరగడంతో ఒక్కరోజే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ముఖ్యంగా మినాబ్ నగరంలోని ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది విద్యార్థినులు, సిబ్బంది మరణించడం అత్యంత విషాదకరం. తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. మంగళవారం ఉదయం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. దీనివల్ల అక్కడ మంటలు చెలరేగి ఆస్తి నష్టం సంభవించింది. బహ్రెయిన్, ఇరాక్, కువైట్, యూఏఈలోని ఆరు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి.

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గం ద్వారా వచ్చే ఏ నౌకనైనా తగలబెడతామని హెచ్చరించింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో క్షిపణుల శిధిలాలు పడటంతో పౌరులు గాయపడ్డారు. గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు స్తంభించిపోయాయి.

Next Story