75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా తమ్ముడు.. ఆ పవిత్ర స్థలంలో.!
75 సంవత్సరాల క్రితం విభజన సమయంలో విడిపోయిన ఒక సిక్కు మహిళ, ఆమె సోదరుడు సోషల్ మీడియా ద్వారా తిరిగి కలుసుకున్నారు.
By అంజి Published on 23 May 2023 11:00 AM IST
75 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా తమ్ముడు.. ఆ పవిత్ర స్థలంలో.!
75 సంవత్సరాల క్రితం విభజన సమయంలో విడిపోయిన ఒక సిక్కు మహిళ, ఆమె సోదరుడు సోషల్ మీడియా ద్వారా తిరిగి కలుసుకున్నారు. ఈ ఉద్వేగ భరిత క్షణాలకు సిక్కుల పవిత్ర స్థలమైన కర్తార్పూర్ కారిడార్ వేదికైంది. భారతదేశానికి చెందిన 81 ఏళ్ల మహేంద్ర కౌర్, 1947లో విభజన సమయంలో విడిపోయిన తన తోబుట్టువని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలుసుకున్న తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్కు చెందిన 78 ఏళ్ల సోదరుడు షేక్ అబ్దుల్ అజీజ్.. తన సోదరిని కర్తార్పూర్ కారిడార్ వద్ద కలుసుకున్నారు. విభజన సమయంలో సదరు వ్యక్తి , అతని సోదరి విడిపోయారని వివరించే సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కౌర్, అజీజ్ విడిపోయిన తోబుట్టువులని రెండు కుటుంబాలు కనుగొన్నాయి.
విభజన సమయంలో అజీజ్ తప్పిపోయాడు. ఆ తర్వాత అతడు పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వెళ్లాడు. ఆ సమయంలో పంజాబ్లోని తన తండ్రి సర్దార్ భజన్ సింగ్ కుటుంబం విషాదకరంగా మారింది. అతని ఇతర కుటుంబ సభ్యులు భారతదేశంలోనే ఉన్నారని అజీజ్ కుటుంబ సభ్యుడు ఇమ్రాన్ షేక్ చెప్పారు. అతను చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నాడు, కానీ తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో తిరిగి కలవాలనే కోరికను కలిగి ఉన్నాడు.
ఆదివారం కౌర్, అజీజ్ వీల్ చైర్లపై కర్తాపూర్ కారిడార్కు వచ్చారు. కుటుంబ సభ్యులు పాటలు పాడుతూ, పూల వర్షం కురిపిస్తూ తమ ప్రేమను చాటుకుంటూ కుటుంబ సమేతంగా సాగిన ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. ఆనందంతో పొంగిపోయి, కౌర్ తన సోదరుడిని పదే పదే కౌగిలించుకుని, అతని చేతులను ముద్దాడింది. రెండు కుటుంబాలు కూడా కలిసి కర్తార్పూర్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను సందర్శించి, పక్కపక్కనే కూర్చుని భోజనం చేశారు.
వారి కలయికకు చిహ్నంగా బహుమతులు కూడా మార్చుకున్నారు. సంతోషకరమైన పునస్సమావేశం తరువాత, కర్తార్పూర్ నిర్వాహకులు రెండు కుటుంబాలను పూలమాలలతో అలంకరించి మిఠాయిలు పంచారు. కర్తార్పూర్ కారిడార్ పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్, సిక్కుమతం వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ అంతిమ విశ్రాంతి స్థలం, భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ జిల్లాలో డేరా బాబా నానక్ మందిరంతో కలుపుతుంది. 4 కి.మీ-పొడవు గల కారిడార్ దర్బార్ సాహిబ్ను సందర్శించడానికి భారతీయ సిక్కు యాత్రికులకు వీసా-రహిత ప్రవేశాన్ని అందిస్తుంది.