కరోనా మహమ్మారికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని.. త్వరలోనే ఈ మహమ్మరి నుంచి బయటపడతామని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇదో షాకింగ్ వార్తే. ఎందుకంటే..? కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు హఠాన్మరణం చెందింది. అమెరికాకు చెందిన ఫైజర్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ పోర్చుగల్ నర్సు వాక్సిన్ వేయించుకున్న 48 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది.
పోర్చుగల్ కి చెందిన సోనియా అసేవెడో(41)పోర్టోలోని పోర్చుగీసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలో పిడియాట్రిక్ అసిస్టెంట్ నర్స్గా పని చేస్తున్నారు. ఫైజర్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలో భాగంగా సోనియా డిసెంబర్ 30న వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తరువాత రెండు రోజులకే ఆమె చనిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న నర్సు చనిపోవడంతో వ్యాక్సిన్పై నీలినీడలు కమ్ముకున్నాయి. వ్యాక్సిన్ పనితీరు పట్ల మరిన్ని అనుమానాలు, భయాలను పెంచుతోంది.
సోనియా తండ్రి అబిలియో అసేవెడో మాట్లాడుతూ.. నా కుమార్తెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా తను మరణించింది. నా కుమార్తె ఎందువల్ల మరణించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా, సోనియాకు మద్యం అలవాటు లేదని,ఈ మధ్య కాలంలో ఎలాంటి కొత్త ఆహార పదార్థాలను తీసుకోలేదని.. అంతా సాధారణంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు.