ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ప్రస్తుతం స్పృహలేని స్థితిలో ఉన్నారని, పవిత్ర నగరమైన కోమ్ (Qom) లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని 'ది టైమ్స్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 28న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితొల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన వైమానిక దాడిలోనే మోజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా-ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు గల్ఫ్ దేశాలతో పంచుకున్న దౌత్యపరమైన మెమోలో ఈ విషయాలు బయటపడ్డాయి.
ప్రస్తుతం మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని, ఆయన దేశ పాలనలో గానీ, ఎటువంటి కీలక నిర్ణయాల్లో గానీ పాల్గొనే స్థితిలో లేరని ఆ నివేదిక పేర్కొంది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 28 నాటి దాడిలోనే 56 ఏళ్ల ఈ షియా మతగురువు కూడా మరణించారనే పుకార్లు షికారు చేసినప్పటికీ, ఆయన గాయపడ్డారని మాత్రమే ఇరాన్ అధికారులు గతంలో ధ్రువీకరించారు.
అయితే, ఇరాన్ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతున్నాయి. ఖమేనీ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, పశ్చిమాసియా సంక్షోభంలో దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారని వారు పదేపదే చెబుతున్నారు. దీనికి మద్దతుగా ఇటీవల ఇరాన్ స్టేట్ టెలివిజన్లో ఆయనకు సంబంధించిన రెండు ప్రకటనలు చదివి వినిపించారు. అంతేకాకుండా, ఆయన ఒక వార్ రూమ్లోకి వెళ్లి ఇజ్రాయెల్ అణు కర్మాగారానికి సంబంధించిన మ్యాప్లను పరిశీలిస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. అయినప్పటికీ, ఆయన ఆసుపత్రిలో ఉన్నారనే వార్తలతో ఇరాన్ రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.