హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: ముగ్గురు భారతీయ నావికుల మృతి.. సురక్షితంగా బయటపడ్డ భారత నౌక

పశ్చిమ ఆసియాలో, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

By -  అంజి
Published on : 13 March 2026 5:03 PM IST

Strait of Hormuz Tensions, Indian Seafarers Casualties, MEA Control Room West Asia, LPG Panic Booking India, Fuel Supply Stability India, Shipping Ministry Monitoring

హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత: ముగ్గురు భారతీయ నావికుల మృతి.. సురక్షితంగా బయటపడ్డ భారత నౌక

పశ్చిమ ఆసియాలో, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంక్షోభం కారణంగా ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతయ్యారని అధికారులు ధృవీకరించారు. మస్కట్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో అసీమ్ ఆర్ మహాజన్, సుహాస్ అనే ఇద్దరు భారతీయులు మరణించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కె సిన్హా మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 24 భారతీయ నౌకలు ఉన్నాయని, వాటిలో 677 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఓమన్ గల్ఫ్ ప్రాంతంలో మరో మూడు నౌకలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం గల్ఫ్ రీజియన్ వ్యాప్తంగా సుమారు 23,000 మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత కోసం షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ నిరంతరం సంబంధిత ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన వివరించారు.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల సహాయార్థం ప్రభుత్వం మార్చి 4న ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దీనికి 900 ఫోన్ కాల్స్, 200 ఈమెయిల్స్ వచ్చాయని జైస్వాల్ తెలిపారు. కువైట్, ఇరాక్ దేశాల్లో గగనతలం మూసివేసి ఉన్నప్పటికీ, భారతీయులను సౌదీ అరేబియా మీదుగా స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇరాన్ నాయకత్వంతో స్వయంగా మాట్లాడి, అక్కడ ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది.

దేశీయంగా ఇంధన సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రజలకు భరోసా ఇచ్చింది. దేశంలోని రిఫైనరీల వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేదని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా 1,01,469 పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఆందోళనతో పెట్రోల్, డీజిల్‌ను డబ్బాల్లో నిల్వ చేసుకోవద్దని ఆమె కోరారు. సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) సరఫరా కూడా నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.

అయితే, హోర్ముజ్ ఉద్రిక్తతల వల్ల ఎల్‌పిజి (LPG) సరఫరాపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన కారణంగా 'పానిక్ బుకింగ్స్' పెరిగాయని ప్రభుత్వం గుర్తించింది. గత కొద్ది రోజుల్లోనే బుకింగ్‌ల సంఖ్య 75.7 లక్షలకు చేరిందని అధికారులు తెలిపారు. మార్చి 5వ తేదీతో పోలిస్తే దేశంలో ఎల్‌పిజి ఉత్పత్తిని 30 శాతం పెంచామని, కాబట్టి అవసరమైతే తప్ప ముందస్తు బుకింగ్‌లు చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సిలిండర్లను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఇప్పటికే ఈ దిశగా అధికారులను ఆదేశించారు.

Next Story