ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 108 మంది బాలికల మృతి
ఇరాన్లోని మినాబ్లో షజారా తయ్యాబా బాలికల స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుమారు 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కొల్పోయారు.
By - అంజి |
ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 108 మంది బాలికల మృతి
ఇరాన్లోని మినాబ్లో షజారా తయ్యాబా బాలికల స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుమారు 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కొల్పోయారు. రక్తంతో తడిసిన బ్యాగులు, చిరిగిన పుస్తకాల మధ్య తమ బిడ్డల ఆనవాళ్ల కోసం తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆటపాటలతో గడపాల్సిన పసిప్రాణాలు ఇలా విగతజీవులుగా మారడం లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
దక్షిణ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో ఉన్న మినాబ్ నగరంలో శనివారం ఉదయం జరిగిన వైమానిక దాడులు పెను విషాదాన్ని నింపాయి. అక్కడ ఉన్న 'షజరే తయీబా' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ 'మిజాన్' ప్రకారం, ఈ దాడిలో 108 మంది మరణించగా, మరో 63 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.
రాజధాని టెహ్రాన్కు తూర్పున ఉన్న మరో పాఠశాలపై జరిగిన దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించినట్లు సమాచారం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘచీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. "అపరాధం తెలియని చిన్నారులను చంపడం హేయమైన చర్య, ఈ నేరానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఆయన హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
తాము కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని, సామాన్య ప్రజలను కాదని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ.. పాఠశాలలపై దాడులు జరగడంపై అంతర్జాతీయ మీడియా (అల్ జజీరా వంటివి) పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతంలో జూన్ 2025లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా వేల సంఖ్యలో ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడులు ఆ చేదు జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ దాడులపై అటు అమెరికా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ అధికారికంగా స్పందించలేదు.