హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ వసూళ్లు.. ఒక్కో నౌకకు రూ. 16 కోట్ల ఫీజు!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుండి ఇరాన్ భారీగా రుసుము వసూలు చేస్తోంది.
By - అంజి |
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ వసూళ్లు.. ఒక్కో నౌకకు రూ. 16 కోట్ల ఫీజు!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుండి ఇరాన్ భారీగా రుసుము వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి దళాలతో జరుగుతున్న యుద్ధం కారణంగా, తమ "అధికారాన్ని" చాటుకోవడానికి ఒక్కో నౌకకు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16 కోట్లకు పైగా) రవాణా రుసుమును ఇరాన్ విధిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ పార్లమెంటు జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలద్దీన్ బ్రౌజెర్డి ఈ విషయాన్ని ధృవీకరించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్త చమురు, సహజ వాయువు (LNG) సరఫరాలో 20 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. మార్చి మొదటి వారం నుండి ఈ మార్గం దాదాపు మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇరాన్ ఈ దిగ్బంధనాన్ని అందరికీ కాకుండా ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే సడలిస్తోంది. తమ శత్రువులకు, వారికి మద్దతు ఇచ్చే దేశాల నౌకలకు మాత్రమే ఈ మార్గం మూసివేసి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని భారతీయ, పాకిస్తానీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది.
ట్రంప్ అల్టిమేటం.. ముదురుతున్న యుద్ధ మేఘాలు:
ఈ ఉద్రిక్తతలు మరింత ముదరడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ప్రధాన కారణం. హోర్ముజ్ జలసంధిని తక్షణమే పూర్తిస్థాయిలో తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా దాడులు చేస్తే మిడిల్ ఈస్ట్లోని కీలక ఇంధన వనరులపై తాము విరుచుకుపడతామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ హెచ్చరించారు. ఒకవేళ యుద్ధం తీవ్రమైతే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడంతో సముద్ర రవాణా స్తంభించిపోయింది.