పాక్-అఫ్గాన్ మధ్య భీకర పోరు: 55 మంది పాక్ సైనికుల మృతి?

అణ్వాయుధ దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 55 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని...

By -  అంజి
Published on : 27 Feb 2026 7:21 AM IST

Pakistan Afghanistan Border Clashes, Durand Line Conflict, Taliban vs Pakistan Military, Airstrikes on Kabul, 55 Pakistani Soldiers Killed, Shehbaz Sharif, Asif Ali Zardari, Border War 2026

పాక్-అఫ్గాన్ మధ్య భీకర పోరు: 55 మంది పాక్ సైనికుల మృతి?

అణ్వాయుధ దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 55 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ వివాదం అఫ్గాన్ నగరాలపై పాక్ వైమానిక దాడులు చేయడంతో మరింత ముదిరింది. శుక్రవారం తెల్లవారుజామున కాబూల్ నగరంలో పేలుళ్లు, విమానాల శబ్దాలు వినిపించాయి. డ్యూరాండ్ లైన్ (సరిహద్దు) వెంబడి ఉన్న పాక్ సైనిక స్థావరాలను తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయని తాలిబన్లు ప్రకటించిన కొద్ది గంటలకే పాక్ ఈ దాడులకు తెగబడింది. పాకిస్థాన్ సైన్యం కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాల్లో పిరికిపందల్లా వైమానిక దాడులు చేసిందని తాలిబన్ ప్రతినిధి ముజాహిద్ పేర్కొన్నారు.

అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 26 రాత్రి 8 గంటలకు (రమదాన్ 9వ రోజు) అఫ్గాన్ దళాలు ప్రతిదాడి ప్రారంభించాయి. అంతకుముందు పాక్ దళాలు అఫ్గాన్ భూభాగంలోకి చొరబడి మహిళలు, చిన్నారులను చంపినందుకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నట్లు అఫ్గాన్ తెలిపింది. నాలుగు గంటల పాటు జరిగిన ఈ పోరులో 2 పాక్ సైనిక స్థావరాలు, 19 పోస్టులను అఫ్గాన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. 55 మంది పాక్ సైనికులు మరణించారని, కొందరిని సజీవంగా బంధించామని, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఒక ట్యాంకును స్వాధీనం చేసుకున్నామని అఫ్గాన్ రక్షణ శాఖ వివరించింది. ఈ పోరులో తమ వైపు 8 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని, 11 మంది గాయపడ్డారని అఫ్గాన్ ప్రభుత్వం అంగీకరించింది.

పాకిస్థాన్ భిన్నమైన వాదనలు

అఫ్గాన్ చేస్తున్న వాదనలను పాకిస్థాన్ తీవ్రంగా తోసిపుచ్చింది. తమ వైపు కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ తెలిపారు. ప్రతిగా తాము జరిపిన కాల్పుల్లో 36 మంది అఫ్గాన్ ఫైటర్లు మరణించారని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని, కానీ తమ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే సహించబోమని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హెచ్చరించారు.

ప్రధాన సరిహద్దు పాయింట్ అయిన తోర్ఖమ్ వద్ద కూడా కాల్పులు జరిగాయి. దీంతో సరిహద్దు పరిసరాల్లోని శరణార్థుల శిబిరాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పాకిస్థాన్ - అఫ్గానిస్థాన్ మధ్య ఉన్న 2,611 కిలోమీటర్ల పొడవైన 'డ్యూరాండ్‌ లైన్' సరిహద్దును అఫ్గాన్ అధికారికంగా గుర్తించడం లేదు. ఇది దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. గత అక్టోబర్‌లో కూడా ఇక్కడ ఘర్షణలు జరిగాయి, అప్పట్లో ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. అయితే తాజాగా పాక్ వైమానిక దాడులు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

Next Story