దౌత్య పోరు: ఇజ్రాయెల్ - పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానున్న తరుణంలో.. ఇజ్రాయెల్ - పాకిస్థాన్ల మధ్య తీవ్ర దౌత్యపరమైన వివాదం చెలరేగింది.
By - అంజి |
దౌత్య పోరు: ఇజ్రాయెల్ - పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానున్న తరుణంలో.. ఇజ్రాయెల్ - పాకిస్థాన్ల మధ్య తీవ్ర దౌత్యపరమైన వివాదం చెలరేగింది. లెబనాన్లో ఇజ్రాయెల్ "జనహననం" చేస్తోందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణమయ్యాయి. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తోన్న ఒక దేశం నుండి ఇటువంటి వ్యాఖ్యలు రావడం పట్ల ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను "అమానుషం" అని వర్ణిస్తూ, ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకునే వారు దౌత్యపరంగా తటస్థంగా ఎలా ఉంటారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రశ్నించింది.
పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'X' లో ఇజ్రాయెల్ ను "మానవత్వానికి శాపం" అని, పాలస్తీనా భూభాగంలో ఏర్పడిన "క్యాన్సర్ లాంటి రాజ్యం" అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. గాజతో మొదలై ఇప్పుడు లెబనాన్ వరకు ఇజ్రాయెల్ రక్తపాతాన్ని కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్, ఇవి కేవలం రాజకీయ విమర్శలు కావని, ఇవి బహిరంగంగా ఇజ్రాయెల్ వినాశనానికి పిలుపునివ్వడమేనని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఇస్లామాబాద్లో జరగనున్న చర్చలకు ముందు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఒడిదుడుకులకు లోనవుతోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా చమురు రవాణాను సులభతరం చేసే విషయంలో ఇరాన్ తన హామీలను నెరవేర్చడం లేదని అమెరికా ఆరోపిస్తోంది. సాధారణంగా రోజుకు 140 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో, ప్రస్తుతం కేవలం ఐదు నౌకలు మాత్రమే తిరుగుతుండటం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను కలవరపెడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే శాంతి చర్చలపై ప్రభావం పడే అవకాశం ఉంది.