కెనడాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు భారతీయుల దుర్మరణం
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 7:29 PM IST
కెనడాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు భారతీయుల దుర్మరణం
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. గురువారమే ఈ రోడ్డుప్రమాదం సంఘటన జరిగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనడా మీడియా సంస్థల వివరాల ప్రకారం.. చండీగఢ్కు చెందిన రీతిక్ ఛబ్రా (23) అతని సోదరుడు రోహన్ (22) ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లారు. వీరు సెనకా కాలేజ్లో చదువుతోన్న పుణెకు చెందిన గౌరవ్ (24) అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ ముగ్గురు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు.
గురువారం రోజున రీతిక్ బర్త్డే ఉంది. దాంతో.. ఆ వేడుకను సెలబ్రేట్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమమంలోనే రాత్రి మొత్తం కారులో ఆలస్యం అయ్యే దాకా తిరిగారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే కారును అతివేగంగా నడిపారు. ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పింది. రోడ్డుకు పక్కనే ఉన్న ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనాస్థలిలోనే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. మార్చురీకి తరలించారు.
మరో కారుతో పోటీ పడి వేగంగా కారు నడిపారనీ.. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.