సింగపూర్లో సెలవులు గడుపుతున్న సమయంలో హోటల్ గదుల్లో ఇద్దరు సెక్స్ వర్కర్లను దోచుకుని దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు పురుషులకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. వారికి ఐదు సంవత్సరాల ఒక నెల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు శిక్షగా విధించారు. 23 ఏళ్ల ఆరోక్కియసామి డైసన్, 27 ఏళ్ల రాజేంద్రన్ మయిలరసన్ బాధితులను దోచుకుని, వారిని గాయపరిచారని తెలుస్తోంది. అంతేకాకుండా నేరాన్ని అంగీకరించారని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.
ఏప్రిల్ 24న సెలవుల కోసం ఆరోక్కియసామి, రాజేంద్రన్ భారతదేశం నుండి సింగపూర్కు వచ్చారు. రెండు రోజుల తర్వాత, లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఒక తెలియని వ్యక్తి వారిని సంప్రదించి సెక్స్ వర్కర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక హోటల్ గదిలో ఒక మహిళను కలవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆమె గదిలోకి ప్రవేశించిన తర్వాత, బాధితురాలి చేతులు, కాళ్ళను దుస్తులతో కట్టి, ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఆమె నగలు, SGD 2,000 నగదు, ఆమె పాస్పోర్ట్, ఆమె బ్యాంక్ కార్డులను దోచుకున్నారు. మళ్లీ రాత్రి 11 గంటల ప్రాంతంలో, వారు మరొక హోటల్లో రెండవ మహిళతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆమె వచ్చినప్పుడు, ఆమెను దోచుకోవడానికి ప్రయత్నించారు, ఆమె చేతులను పట్టుకుని లాగారు. ఆమె అరవకుండా ఉండటానికి రాజేంద్రన్ ఆమె నోటిని మూశారు. ఆమె నుండి SGD 800 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఆమె పాస్పోర్ట్ను దొంగిలించారు, తాము తిరిగి వచ్చే వరకు గది నుండి బయటకు వెళ్లవద్దని ఆమెను బెదిరించారు. మరుసటి రోజు రెండవ బాధితురాలు మరొక వ్యక్తి ఆరోక్కియసామి, రాజేంద్రన్ చేసిన పని గురించి చెప్పుకుంది. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో నిందితులు చేసిన తప్పును ఒప్పుకున్నారు.