వీల్ఛైర్ అడిగితే జైల్లో పెట్టిస్తా.. స్పందించిన కేంద్రమంత్రి
By జ్యోత్స్న Published on 16 Jan 2020 4:48 AM GMTఢిల్లీ: ఓ మహిళతో పరుషంగా మాట్లాడి బెదిరించిన ఇండిగో పైలట్ ఘటనపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి స్పందించారు. అతనిని విధుల నుంచి తప్పించి పూర్తి విచారణకు ఆదేశించినట్టు విమానయాన సంస్థ తెలిపిందన్నారు. సంఘటన వివరాల్లోకి వెళ్తే... సోమవారం రాత్రి సుప్రియ ఉన్ని నాయర్ తన 75ఏళ్ల తల్లితో కలిసి ఇండిగో విమానం ఎక్కింది. తన తల్లి అనార్యోగ పరిస్థితుల కారణంగా విమానం నుంచి దిగే సమయంలో ఆమెకు వీల్ఛైర్ ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రియ విమాన సిబ్బందిని కోరింది. దీనిపై పైలట్ జయకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించాడు.
ఈ విషయాన్ని సుప్రియ ట్విటర్లో పోస్టు చేయడంతో అది కేంద్రమంత్రి దృష్టికి వెళ్లింది. వీల్ఛైర్ అడిగితే ఒకరోజంతా జైల్లో పెట్టిస్తానని తమను బెదిరించారని, మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎలా ప్రవర్తించాలో మీకు నేను నేర్పిస్తాను అంటూ గట్టిగా తమపై అరిచినట్లు సుప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత విమానాశ్రయ సిబ్బంది వీల్ఛైర్ తీసుకొచ్చి వాళ్లను తీసుకెళ్లారని కానీ ఆ సమయంలో కూడా గట్టిగట్టిగా అరుస్తూ విమానాశ్రయంలో తమను దుర్భాషలాడినట్లు ఆమె తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పూరి విచారణకు ఆదేశించారు.