ఒక్క రోజే 63,490 కొత్త కరోనా కేసులు.. మరణాలు 944

By సుభాష్  Published on  16 Aug 2020 5:24 AM GMT
ఒక్క రోజే 63,490 కొత్త కరోనా కేసులు.. మరణాలు 944

భారత్‌ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్య మరింత కలవరపెడుతోంది. నిత్యం భారత్‌ లో దాదాపు వెయ్యి మందికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 944 మంది మృతి చెందారు. ఇక ఆదివారం నాటికి దేశంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 49,980కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ప్రతి రోజు 60 మంది కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా నిన్న ఒక్క రోజే 63,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కేసుల సంఖ్య 25,89,682కు చేరింది. వీరిలో 18 లక్షల 62వేల మంది కరోనా నుంచి కోలుకోగా, నిన్న 53వేలకుపైగా కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోకరోనా బాధితుల రికవరీ రేటు 71శాతం ఉండగా, మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక ప్రపంచంలో కరోనా కేసుల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికి పాకింది. ఈ వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో కరోనా మరణాలు 50వేలకు చేరువలో ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది. వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఎలాంటి మార్గం లేదు. కరోనా కట్టడికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలమునలకవుతున్నాయి. అయినా రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

కొందరి తప్పిదం వల్లే వైరస్‌ వ్యాప్తి

కరోనా వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా కొందరి అజాగ్రత్త వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించినా కొందరు పెడ చెవిన పెడుతున్నారని, అలాంటి వారి వల్ల వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోతోందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

► నిన్న ఒక్క రోజు కొత్త కేసులు - 63,490

► నిన్న ఒక్క రోజు మరణాలు - 944

► ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య - 25,89,682

► ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య -49,980

► ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య - 18లక్షల 62వేలు

► ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య - 6 లక్షల 77వేలు

► గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య - 53వేలు

► ప్రస్తుతం దేశంలోకరోనా బాధితుల రికవరీ రేటు - 71శాతం

► మరణాల రేటు దాదాపు 1.9శాతం

Next Story