భారత్‌లో కరోనా మృత్యుకేళి.. ఒక్క రోజే 2003 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 5:05 AM GMT
భారత్‌లో కరోనా మృత్యుకేళి.. ఒక్క రోజే 2003 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు తరువాత దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2003 మంది మృత్యువాత పడగా.. 10,974 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటికి ఒక్క రోజు వ్యవధిలో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 3,54,065 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 11,903 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదైన కేసుల్లో 1,86,935 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,55,227 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో ఉంది. ఇక మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ ఎనిమిదవ స్థానానికి చేరుకుంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడం కాస్త ఊరటనిస్తుంది. ఇక రికవరీ రేటు 52.5శాతంగా ఉండగా.. మరణాల రేటు 3.4శాతానికి పెరిగింది.

Next Story