భారత్లో కరోనా విజృంభణ.. 33వేల కేసులు.. 1074 మరణాలు
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 5:59 AM GMTభారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి నియంత్రణకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికి రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 67 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో కలిసి దేశంలో 33,050 కి కరోనా పాజిటివ్ కేసులు చేరుకోగా.. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 1,074 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య. కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 8,325 మంది కోలుకోని డిశ్చార్జి కాగా.. 23,651 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 597 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 32 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ 9,915 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 432 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్ లో 4,082 కేసులు నమోదు కాగా.. 197 మంది మృత్యువాత పడ్డారు. మధ్యప్రదేశ్ లో 2,561 కేసులు నమోదు కాగా.. 129 మంది మృతి చెందారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,439 కేసులు నమోదు కాగా.. 56 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ మహమ్మారి విజృభిస్తోంది. నిన్న ఒక్క రోజే 73 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. రాష్ట్రంలో మొత్తం 1,332 కేసులకు చేరగా.. 31 మంది మరణించారు. ఇక తెలంగాణలో 1,016 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 25 మంది చనిపోయారు.