వణికిస్తున్న కరోనా.. భారత్లో రికార్డు కేసులు
By తోట వంశీ కుమార్ Published on 29 May 2020 4:47 AM GMTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత్ ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,466 పాజిటివ్ కేసులు నమోదు కాగా 175 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కరోనా మహమ్మారి భారత్లో విజృంభణ మొదలైన తరువాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799కి చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి భారీన పడి 4,706 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 71,106 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 89,987 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా మరణాల్లో భారత్ చైనాను దాటేసింది. కరోనా మహమ్మారి చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అక్కడ ఈ మహమ్మారి కారణంగా 4,634 మంది మృతి చెందగా.. భారత్లో 4,706 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కరోనా కేసుల సంఖ్య లోనూ భారత్ చైనాను దాటిన సంగతి తెలిసిందే. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ 9వ స్థానానికి ఎగబాకింది. ఇది భారత్లో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది.