భారత్లో విజృంభిస్తున్న కరోనా.. సగటున రోజుకు ఆరువేల కేసులు
By తోట వంశీ కుమార్ Published on 26 May 2020 6:01 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన వారం రోజులుగా సగటున 6వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,535 కేసులు నమోదు కాగా.. 146 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరింది. ఈ మహమ్మారి భారిన పడి 4,167 మంది మృత్యువాత పడ్డారు.
మొత్తం నమోదు అయిన కేసుల్లో 60,491 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 80,772 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన వారం రోజుల్లో 45వేలకు పైగా కేసులు నమోదు కావడం ప్రస్తుత వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు , దిల్లీ రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ పదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.