అంటార్కిటికాలో అత్యధిక ఉష్ణోగ్రతలు..

By అంజి  Published on  17 Feb 2020 3:20 AM GMT
అంటార్కిటికాలో అత్యధిక ఉష్ణోగ్రతలు..

భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతోంది అంటూ పర్యావరణ ప్రేమికులు మొత్తుకుంటున్నా కూడా అసలు పట్టించుకోని వారు ఎందరో..! పర్యావరణానికి మనుషులు చేస్తున్న నష్టం వలన భూతాపం పెరిగిపోతోంది. ఇప్పటికే విపరీతమైన వేడి గాలులు, తుఫానులు.. భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇక వాతావరణంలో వచ్చే మార్పులను కూడా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అంటార్కిటికాలో మంచు అతి వేగంగా కరిగిపోతోందని కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఏకంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత అంటార్కిటికాలో నమోదయింది.

ఫిబ్రవరి 9న బ్రెజిలియన్ శాత్రవేత్తలు అంటార్కిటికా ద్వీప కల్పంలో ఉన్న 'సేమర్ ఐలాండ్' లో ఏకంగా 20.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తించారు. అంటార్కిటికా ముఖ్యభాగంలో ఫిబ్రవరి 6 న ఏకంగా 18.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందని అర్జెంటీనాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫిబ్రవరి 6 న సేమర్ ఐలాండ్ లో 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు మరో బృందం తెలిపింది. ఇవి అర్జెంటీనా ఉష్ణోగ్రతల్లో అత్యధిక రికార్డులు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

1982, జనవరి నెలలో అంటార్కిటికాలోని 'సిగ్ని ద్వీపం' లో 19.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇప్పటి వరకూ అంటార్కిటికాలో అదే అత్యధిక ఉష్ణోగ్రత.. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెరిగిపోయింది. రానున్న రోజుల్లో అక్కడ వేడి మరింత పెరిగిపోయే అవకాశం ఉందని World Meteorologial Organisation (WMO) చెబుతోంది. గ్లోబల్ హీటింగ్ కారణంగా అంటార్కిటికాలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతోంది.

అంటార్కిటికాలోని రిమోట్ మానిటరింగ్ స్టేషన్స్ నుండి వాతావరణ డేటాను కలెక్ట్ చేసే శాస్త్రవేతలు ఆ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూసి షాక్ తిన్నారు. ఇలాగే కొనసాగితే చాలా కష్టం అని అంటున్నారు. భూమి మీద తాజా నీటిలో అంటార్కిటికా 70 శాతం కలిగి ఉంది. 1979 నుండి 1990 వరకూ ఒక్కో ఏడాది 40 బిలియన్ల టన్నుల మంచు కరుగుతూ ఉండగా.. 2009 నుండి ఒక్కో ఏడాదికి 250 బిలియన్ టన్నుల మంచు కరుగుతూ వస్తోంది. దాదాపు ఆరు రెట్లు వేగంగా మంచు కరుగుతోంది. అంటార్కిటికాలో మంచు విపరీతంగా కరగడం వలన సముద్ర మట్టం కూడా పెరగనుంది. 2100 సంవత్సరం వచ్చే సమయానికి దాదాపు ఒక మీటర్ ఎత్తు వరకూ సముద్ర మట్టం పెరగనుంది. చాలా సుప్రసిద్ధ నగరాలపై ఇది ప్రభావం చూపనుంది. ఇప్పటికే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ప్రకటించారు శాస్త్రవేత్తలు.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పలు దేశాల నేతలను కోరుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవజాతి మనుగడే కష్టమవుతుంది.

Next Story