ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
By Newsmeter.Network Published on 8 April 2020 12:04 PM ISTప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ భారిన పడి వందలాది మంది ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ను పకడ్బందీగా అమలు చేసినా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉంది. బుధవారం మధ్యాహ్నం వరకు 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 329కి చేరింది. ఏపీలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాబోయే రోజుల్లో 3లక్షల ర్యాపిడ్ టెస్ట్ లు చేసేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read :అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ రిలీజ్
ఇదిలా ఉంటే బుధవారం ఉదయం నమోదైన 15 పాజిటివ్ కేసుల్లో నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఆరు చొప్పున, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులెటిన్లో వెల్లడించారు. ఇదిలాఉంటే జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలను చూస్తే.. అనంతపురంలో ఆరు, చిత్తూరు జిల్లాలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 41, కడప జిల్లాలో 28, క్రిష్ణా జిల్లాలో 35, కర్నూల్ జిల్లాలో 74, నెల్లూరులో 49, ప్రకాశంలో 24, విశాఖపట్టణంలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక శ్రీకాకుళం, వైజాగ్లలో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కాగా ఈ జిల్లాల్లో పలువురు కరోనా అనుమానితులను క్వారంటైన్కు పంపించారు.