హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం - హస్తినాపురం ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మహావీర్ ఇంజనీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది. అతివేగంతో వచ్చిన ఓ హోండా సిటీ కారు సృష్టించిన బీభత్సానికి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న శివ, సందీప్ జోహెల్ అనే విద్యార్థులు తమ బైక్పై వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన హోండా సిటీ కారు వారిని బలంగా ఢీకొట్టింది. అంతకుముందే ఆ కారు మరో వ్యక్తిని ఢీకొట్టినట్లు సమాచారం. బైక్ను ఢీకొట్టిన అనంతరం కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొడుతూ బోల్తా పడింది.
ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, విద్యార్థులు ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పాట్లోనే మృతి చెందారు. తమ తోటి స్నేహితులు మరణించారన్న వార్త తెలియగానే మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడి ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ఘోరం జరిగిందని మండిపడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.