తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) దక్షిణ బెంచ్ నుంచి ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాల్ చేస్తూ బిఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఎన్జీటీ గురువారం కొట్టివేసింది.
ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు (Environmental Clearances) లేకుండానే ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తోందని, తక్షణమే పనులను నిలిపివేయాలని పిటిషనర్ ట్రిబ్యునల్ను కోరారు. అయితే, ఈ వాదనలతో బెంచ్ ఏకీభవించలేదు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పిటిషనర్ లేవనెత్తిన అంశాలన్నీ ఇప్పటికే స్టేట్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అథారిటీ జారీ చేసిన 'టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్' (ToR) పరిధిలోకి వస్తాయని ఎన్జీటీ పరిశీలించింది.
ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తోందని భావించిన ట్రిబ్యునల్, అభివృద్ధి పనులను అడ్డుకోవాలన్న పిటిషనర్ విన్నపాన్ని తిరస్కరిస్తూ దరఖాస్తును డిస్మిస్ చేసింది. దీంతో మూసీ పునరుజ్జీవన పనులకు ఉన్న ఒక ప్రధాన చట్టపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది.