Hyderabad: ఆదిత్య బిల్డర్స్పై కవిత ఆరోపణల వివాదం.. హైడ్రా క్లారిటీ
నార్సింగి వద్ద మూసీ నది పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరసనపై హైడ్రా...
By - అంజి |
Hyderabad: ఆదిత్య బిల్డర్స్పై కవిత ఆరోపణల వివాదం.. హైడ్రా క్లారిటీ
హైదరాబాద్: నార్సింగి వద్ద మూసీ నది పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన నిరసనపై హైడ్రా (HYDRAA) స్పందించింది. ఆదిత్య బిల్డర్స్కు సంబంధించిన అనుమతులు, కోర్టు ఉత్తర్వుల క్రమాన్ని వివరిస్తూ ఒక సమగ్ర ప్రకటన విడుదల చేసింది. ఈ వివాదంలో రాజకీయ విమర్శలకు తావులేదని, అంతా న్యాయస్థానం ఆదేశాల మేరకే జరుగుతోందని స్పష్టం చేసింది. హైడ్రా వివరణ ప్రకారం.. ఆదిత్య బిల్డర్స్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ అనుమతులు లభించాయి. అయితే, మూసీ నది సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తూ రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మించినట్లు గుర్తించిన అప్పటి ప్రభుత్వం, ఆ అనుమతులను రద్దు చేసింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రద్దు నిర్ణయాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో బిల్డర్ హైకోర్టును ఆశ్రయించగా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని నీటిపారుదల మరియు రెవెన్యూ శాఖలను కోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు నది పరిధిలో ఉన్న రిటైనింగ్ వాల్ను బిల్డర్ తొలగించారు. నది సరిహద్దుల నుండి వెనక్కి తగ్గి, అనుమతించిన పరిమితుల్లోనే నిర్మాణాలు చేపడతామని కోర్టుకు హామీ ఇచ్చారు. అధికారుల నివేదికలు, బిల్డర్ ఇచ్చిన అఫిడవిట్ను పరిశీలించిన తర్వాతే హైకోర్టు ఆ నిర్మాణ అనుమతులను పునరుద్ధరించింది. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదని, న్యాయపరమైన ప్రక్రియ అని హైడ్రా నొక్కి చెప్పింది.
ముఖ్యంగా, ఈ అనుమతుల రద్దు, కోర్టు జోక్యం, తనిఖీలు మరియు పునరుద్ధరణ ప్రక్రియ అంతా హైడ్రా ఉనికిలోకి రాకముందే జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. "ఈ అనుమతులు ఇవ్వడంలో కానీ, పునరుద్ధరించడంలో కానీ హైడ్రాకు ఎటువంటి పాత్ర లేదు. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో జరిగిన ప్రక్రియ," అని ఏజెన్సీ పేర్కొంది. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
అంతకుముందు, నార్సింగి వద్ద భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ మూసీ నదిని ఆక్రమించి కడుతున్నారని ఆరోపిస్తూ కవిత ధర్నా చేపట్టారు. పేదల ఇళ్లను టార్గెట్ చేస్తున్న హైడ్రా, పెద్ద బిల్డర్ల ఉల్లంఘనలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ నిరసన సందర్భంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి ఇక్కడ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.