Hyderabad: ఎల్బీ నగర్ టు హయాత్నగర్.. రూ.941 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్!
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై నిత్యం నరకప్రాయంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది.
By - అంజి |
Hyderabad: ఎల్బీ నగర్ టు హయాత్నగర్.. రూ.941 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్!
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై నిత్యం నరకప్రాయంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. ఎల్బీ నగర్ నుంచి హయాత్నగర్ వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేర ₹941 కోట్లతో ఒక బృహత్తర డబుల్ డెక్కర్ కారిడార్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సుమారు 10 నుండి 12 లక్షల మంది ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.
మూడంచెల అద్భుతం (Three-Tier Structure):
ఈ ప్రాజెక్టును అత్యంత ఆధునిక సాంకేతికతతో, నాగ్పూర్ మోడల్లో రూపొందించనున్నారు. ఇది మూడు అంచెలుగా ఉంటుంది:
గ్రౌండ్ లెవల్: సాధారణ ప్రయాణికుల కోసం సర్వీస్ రోడ్లు.
మధ్య లెవల్: వాహనాల వేగవంతమైన ప్రయాణం కోసం మెయిన్ హైవే (ఫ్లైఓవర్).
పై లెవల్: మెట్రో రైలు కారిడార్.
అంటే ఒకే మార్గంలో అటు వాహనాలు, ఇటు మెట్రో రైలు ప్రయాణించేలా ఈ అద్భుత కట్టడం రూపుదిద్దుకోనుంది.
నిధులు, అనుమతులు:
ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం ₹941 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ₹741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ₹200 కోట్లు భరించనున్నాయి. అసెంబ్లీలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను ఇప్పటికే కేంద్రానికి పంపామని, అనుమతులు రాగానే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేస్తామని తెలిపారు. ఇదే తరహాలో భవిష్యత్తులో బీహెచ్ఈఎల్ (BHEL) – మదీనాగూడ మార్గంలో కూడా డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రయాణ సమయం ఆదా.. పారదర్శక పనులు:
ఈ కారిడార్ పూర్తయితే హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. కేవలం ప్రయాణమే కాకుండా రోడ్ల నాణ్యత విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద టెండర్లు పిలిచామని, కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో పారదర్శకత కోసం 'డైరెక్ట్ డెబిట్' విధానాన్ని ప్రవేశపెట్టామని మంత్రి వెల్లడించారు.