నెల రోజులుగా అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి.. అమెరికాలో శవమై కనిపించడంతో..

గత నెల నుంచి అదృశ్యమైన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ మరణం వారం వ్యవధిలో రెండోది

By అంజి  Published on  9 April 2024 4:30 AM GMT
Hyderabad student, missing, USA, Ohio

నెల రోజులుగా అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి.. అమెరికాలో శవమై కనిపించడంతో..

గత నెల నుంచి అదృశ్యమైన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ మరణం వారం వ్యవధిలో రెండోది కాగా 2024లో 11వది. అర్ఫాత్ మరణాన్ని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. "సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడని తెలుసుకుని చాలా బాధపడ్డాను" అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేశారు.

క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీ విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపేందుకు యుఎస్‌లోని స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కాన్సులేట్ తెలిపింది. "అతని మృత దేహాన్ని భారత్‌కు తరలించేందుకు మృతుల కుటుంబానికి అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నాం" అని కాన్సులేట్ తెలిపింది.

క్లీవ్‌ల్యాండ్ యూనివర్శిటీ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు అర్ఫాత్ మే 2023లో యూఎస్‌ చేరుకున్నారు. 25 ఏళ్ల యువకుడు మార్చి 7న అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అర్ఫాత్‌తో సంబంధాలు తెగిపోయాయని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని అతని తండ్రి చెప్పారు.

మార్చి 19న, అర్ఫాత్ కుటుంబానికి డబ్బులు డిమాండ్‌ చేస్తూ కాల్ వచ్చింది. డ్రగ్స్ అమ్మే ముఠా అతన్ని కిడ్నాప్ చేసిందని, అతనిని విడుదల చేయడానికి 1,200 డాలర్లు డిమాండ్ చేసిందని చెప్పబడింది. డబ్బులు చెల్లించకుంటే విద్యార్థి కిడ్నీలను కూడా అమ్మేస్తానని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడని అర్ఫాత్ తండ్రి తెలిపారు.

"నాకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. నా కొడుకు కిడ్నాప్ చేయబడ్డాడని కాల్ చేసిన వ్యక్తి నాకు సమాచారం ఇచ్చాడు. డబ్బు డిమాండ్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి చెల్లింపు విధానం గురించి చెప్పలేదు కానీ మొత్తం చెల్లించమని అడిగాడు. నా కొడుకుతో మాట్లాడేందుకు మమ్మల్ని అనుమతించమని నేను కాలర్‌ని కోరినప్పుడు అతను నిరాకరించాడు" అని అర్ఫాత్ తండ్రి చెప్పారు.

మార్చి 21న, అర్ఫాత్‌ను గుర్తించేందుకు స్థానిక చట్ట అమలు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు భారత కాన్సులేట్ తెలిపింది. విద్యార్థి కుటుంబం అర్ఫాత్‌ను గుర్తించి భారత్‌కు తీసుకురావాలని అభ్యర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ కూడా రాసింది.

Next Story